Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7717 Registered: 03-2004 Posted From: 68.14.9.117
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 09, 2015 - 6:41 pm: | |
ఇదీ కేసీఆర్ ఇలాకా..వందల కోట్ల అభివృద్ధి మాటలకే పరిమితం.. అడుగు కూడా ముందుకు పడని రింగు రోడ్డు గజ్వేల్, జూలై 9: మెదక్ జిల్లా గజ్వేల్! ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం! సీఎం తరచూ కురిపించే వరాల జల్లులో తడిసి ముద్దయిపోతున్నది. హామీల సునామీతో వణికిపోతున్నది. ‘ఇక రూపురేఖలు మారడమే తరువాయి’ అంటూ నియోజకవర్గం మొత్తం మురిసిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు గజ్వేల్లో ఏవో అద్భుతాలు జరుగుతున్నాయని ఊహించుకుంటున్నారు. కానీ... వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ‘గజ్వేల్ను అన్ని రంగాల్లో రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతా’ అని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ప్రత్యేకంగా అభివృద్ధి అథారిటీని కూడా నియమించారు. పదులకొద్దీ హామీల్లో కొన్నింటిని ప్రారంభించనేలేదు! కొన్నింటిని ప్రారంభించినప్పటికీ... పనుల్లో పురోగతి లేదు. కేసీఆర్ అధికారం చేపట్టి ఏడాది దాటింది. ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నీ పూర్తికావాలనేమీ లేదు. కానీ... మిగిలిన నాలుగేళ్లలోనైనా పూర్తవుతాయనే నమ్మకం ప్రజల్లో కలిగించాలి. ఆ నమ్మకం కలగాలంటే... ఏడాదిలో ఎంతోకొంతైనా పనులు జరిగి ఉండాలి. కానీ... కేసీఆర్ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే... రింగు రోడ్డు ఏదీ!? గత ఏడాది జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగో తేదీన గజ్వేల్ వచ్చారు. గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు నిర్మాణంసహా... అనేక హామీలు గుప్పించారు. రింగు రోడ్డుకు రూ.90 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఏడాది పూర్తి కావస్తోంది. కానీ, రింగు రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ సర్వే కూడా పూర్తి కాలేదు. వేయి కోట్లు ఏవీ? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ అనేకసార్లు గజ్వేల్ వచ్చారు. సుమారు వేయి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. కానీ... ఏడాదిలో విడుదలైంది రూ.75 కోట్లలోపే! తాగునీటి సమస్య యథాతథం! ‘గజ్వేల్ నా సొంత నియోజకవర్గం. ఇక్కడ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా’ అని సీఎం కేసీఆర్ ఏడెనిమిది నెలల కిందట ప్రకటించారు. ఇందుకు గోదావరి సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రకటించారు. దాని పైప్లైన్ నుంచి నీరు మళ్లించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీరు సరఫరా చేస్తామని అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 30 శాతం మందికి సరిపడే నీరు కూడా అందడం లేదు. పలు గ్రామాల్లో ట్రాక్టర్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ‘ముఖ్యమంత్రిగారూ దయచేసి మాకు నీటి సరఫరా చేయించండి’ అంటూ ప్రజ్ఞాపూర్ గ్రామస్తులు నడిరోడ్డుపై ధర్నా చేశారు కూడా. వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామ పంచాయతీ పరిఽధిలోని బొర్రగూడెంలోనూ తాగునీటి సమస్య తారస్థాయికి చేరడంతో రెండునెలల క్రితం గజ్వేల్ పర్యటనకు వచ్చిన శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ను అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. ఆయన మరో మార్గంలో హైదరాబాద్కు వెళ్లిపోయారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మిల్క్ గ్రిడ్ నిర్లక్ష్యం పాలు గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించారు. వాటిలో రూ.30 కోట్లతో చేపట్టే మిల్క్ గ్రిడ్ ఒకటి. నియోజకవర్గ పరిధిలో సుమారు ఐదు వేల పాడి పశువుల యూనిట్లు ఏర్పాటు చేసి, రోజుకు లక్ష లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. మిల్క్ గ్రిడ్ను ప్రారంభిస్తున్నట్లు గత డిసెంబర్లో మంత్రి హరీశ్రావు ప్రకటించారు. నియోజకవర్గంలో సుమారు 2000 మంది పాడి రైతులను గుర్తించారు. అయితే, వారికి సబ్సిడీ ఇచ్చేందుకు నాబార్డు నిరాకరించడంతో ఇంతవరకు ఒక్క యూనిట్ను కూడా ప్రారంభించలేదు. ఉద్యాన వర్సిటీ ఎప్పుడు? రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకంగా ఉద్యాన వర్సిటీ, కోయంబత్తూరు తరహాలో 500 ఎకరాల విస్తీర్ణంలో అటవీ కాలేజీని ములుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తామని సీఎం గత అక్టోబర్లో ప్రకటించారు. వేయి హెక్టార్ల అటవీ భూమిని సేకరించి భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 8 నెలలు గడిచినా ఇప్పటి వరకూ వీటికి అతీ గతీ లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దానిచుట్టూ కందకం తవ్వి గచ్చకాయల తీగలతో కంచె వేస్తామని చెప్పారు. దీని సంగతీ అంతే! రైతు ఆత్మహత్యలపై నిర్లక్ష్యం తన నియోజకవర్గంలో అన్నదాతల జాతకాలు మారిపోతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే... గత ఏడాది కాలంలో తెలంగాణ మొత్తంమీద మెదక్ జిల్లాలో, అందునా, గజ్వేల్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 70 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత రైతు కుటుంబాలను కాంగ్రెస్, టీడీపీ నేతలు పరామర్శించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క కుటుంబాన్ని అయినా పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం పరామర్శకు పంపలేదు. ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా 23 టీఎంసీల నిలువ సామర్థ్యంతో పాములపర్తిలో రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు. సబ్ స్టేషన్లు ఇంకా రాలే! గజ్వేల్ నియోజకవర్గంలో మరో మూడు 132 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవి ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. వేలాడుతున్న విద్యుత్తు తీగలను, వంగిన స్తంభాలను సరి చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రహదారికి ఏదీ మహర్దశ గజ్వేల్ నియోజకవర్గంలోని రహదారులకు మహర్దశ వచ్చినట్లేనని కేసీఆర్ ఊరించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో డబుల్ రోడ్లు, వీధి దీపాలు వేస్తామన్నారు. మొత్తంగా ఈ పనులకు రూ.411 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కానీ... రాష్ట్ర విభజనకు ముందే మంజూరైన, విడుదలైన నిధులతోనే పనులు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. కొత్తగా... రూ.25 కోట్లతో సీసీ రోడ్లును మాత్రం పూర్తి చేశారు. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలోనే 7.5 కోట్లు మంజూరు కాగా తెలంగాణ ఏర్పడి ఏడాది గడుస్తున్నా కేవలం 3 కిలోమీటర్ల రోడ్డు కూడా నిర్మాణం పూర్తికాలేదు. మిషన్ కాకతీయ అంతంత మాత్రమే.... కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిది. ప్రతి ఏటా 20 శాతం చెరువుల చొప్పున ఐదేళ్లలో మొత్తం చెరువులను పునరుద్ధరించాలన్నది దీని లక్ష్యం. కానీ, కేసీఆర్ సొంత గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం రెండేళ్లలోనే మొత్తం చెరువులను మరమ్మతు పూర్తి చేస్తామని ప్రకటించి, నిధులు కూడా విడుదల చేశారు. అయితే...మొదటి దఫా గుర్తించిన 606చెరువుల్లో 50 శాతం కూడా పూర్తి స్థాయిలో మరమ్మతుకు నోచుకోలేదు. విచారణలోనే ఐదువేల ఇళ్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గజ్వేల్లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీకి ఐదు వేల ఇళ్లను ప్రకటించారు. కానీ, లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొనసాగుతోంది. |